Saturday, May 23, 2020

మకరతోరణం

మకరతోరణం అంటే ఏంటి దాని పుట్టుపూర్వోత్తరాలు ఈరోజు తెలుసుకుందాం🙏 వివిధ దేవాలయాలలో ద్వారతోరణమధ్యభాగంలో ఒక కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే మకరతోరణమని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణమధ్యంలో అలంకరించటానికి గల కారణమును గురించి స్కందమహాపురాణంలో ఒక కథ ఉన్నది. పూర్వం "కీర్తిముఖుడ"నే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది అలా వచ్చిన బలపరాక్రమాలతో సమస్తభువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు నారదుని ప్రేరణతో పరమశివపత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశపడ్డాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. లోకాలను అన్నింటినీ మ్రింగివేస్తూ ఆ అగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణంలేకుండా వరం పొందిన కీర్తిముఖుడు ఆ అగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలలో తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడాడు., భక్తవశంకరుడైన శివుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవకన్నుగా దానిని ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తట్టుకోలేనంత ఆకలిగా ఉన్నదని తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని వచనానుసారం మొసలి రూపును ధరించి ఆ కీర్తిముఖుడు తనను తాను ముందుగా తోకభాగంనుంచి తినటం మొదలు పెట్టాడు. తన శరీరాన్ని అలా తింటూ తింటూ కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. నీవు ఈ నాటినుంచి సమస్తదేవతాలయాలలో తోరణాగ్రభాగాన్ని అలంకరించు. దెవతా దర్శనానినికి వచ్చే ప్రజలందరిలో ఉండే దుష్టమైన అహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు "అని వరమిచ్చాడు. ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని తోరణామధ్యభాగాన్ని తన రాక్షసమకరముఖంతో అధిష్ఠించి అలంకరించి భక్తులలో ఉండే దుష్టవికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తూ విరాజిల్లుతున్నాడు. అందుకనే దేవతామూర్తుల వెనుకనుండే తోరణానికి మకరతోరణం అని పేరు వచ్చింది..🙏 ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

No comments:

Post a Comment