Wednesday, August 1, 2012


THURSDAY, NOVEMBER 4, 2010

దీపాలంకరణ, లక్ష్మీ పూజ


భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలుగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాలగోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘమఘమలు, బాణసంచా చప్పుళ్లు ,ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.


దీపం జ్యోతి:పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌!
దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీప నమ్మోస్తుతే!!
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.

మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలు వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు, కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో వస్తుంది. మనోనిశ్చలతకు సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళీ రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకుంటారు.
నరకచతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ్రపసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య, లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసురసంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినపుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న ఆధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారిమధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు.
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆరోజు నరక చతుర్దశిగా పిలవబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధు జనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మం సుప్రతిష్ఠితమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారదోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
దీపావళి అంటే దీపోత్సవం.. ఆరోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు, ప్రసా దించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.
తైలే లక్షీర్జలే గంగా దీపావళి తిథౌపనేత్‌!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!!
దీపావళి నాడు నూనెలో (ముఖ్యంగా నువ్వుల నూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు, మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మరూపంలో నిండి ఉంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల దారిద్రం తొలగుతుంది. గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది. నరక భయం ఉండదనేది పురాణాలు చెబుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్తులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళి నాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి అంటూ మూడు సార్లు దోసిట్లో నీరు విడిచి పెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు.స్ర్తీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీ పూజకు సన్నాహాలు చేసుకుంటారు. రకరకాలైన రుచికరమైన వంటకాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్ధం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం ,ఆరోజంతా ఎక్కడలేని హడావుడి ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుంటాయి.


సత్యం-శివం-సుందరం
పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని .ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరిస్తాయి. నీలము, పసుపు, తెలుపు. ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు పేర్కొన్నారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి,దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం- అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా చెబుతారు భారతీయులు.
అంధతమిప్రంచ దక్షిణాయనమేవచ
ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే.
అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకుని తరించడానికి ఉత్తారాయణ పుణ్యకాలంలో జ్యోతి ని దానం చేయడం ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజమాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ ఇది. 
దిబ్బుదిబ్బు దీపావళి...అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్నచిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. 


ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తర్వాత పుజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు.


పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులౌతారు. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది. ఆ వెలుగులో శబ్దతరంగాల్లో దారిద్య్ర దుఃఖాలు దూరంగా తరిమి వేయబడి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని అంతేకాక వర్షరుతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాలు బాణసంచా పొగలకు నశిస్తాయి.

No comments:

Post a Comment